Wednesday, September 21, 2016

మునగాకు గోరుచిక్కుడు వేపుడు

మునగాకు - గుప్పెడు
లేత గోరుచిక్కుడు కాయలు - 1/4 కె.జి
పెసరపప్పు- గుప్పెడు
ఉల్లిపాయ పెద్దది - 1
పచ్చి మిర్చి - 4
వెల్లుల్లి - 5 రెబ్బలు
వేపుడు కారం -1 టేబుల్ స్పూను(ఎండు మిర్చి,జీరా మిక్సీలో వేయాలి)
ఉప్పు - సరిపడా
                                                                 ముందుగా గోరు చిక్కుడు కాయలు ముక్కలు కోసి మెత్తగా కాకుండా ఉడికించాలి.పెసరపప్పు కడిగి మెత్తబడకుండా కొద్దిగా ఉడికించి నీళ్ళు వంపి పక్కన పెట్టాలి.బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి,తాలింపు దినుసులు,కరివేపాకు,మునగాకు వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనిచ్చి గోరు చిక్కుడు ముక్కలు వేసి కొద్దిగా వేగాక పెసరపప్పు వేసి వేగనివ్వాలి.వెల్లుల్లి దంచి వేసి,ఉప్పు,వేపుడు కారం వేసి రెండు సార్లు అటుఇటు తిప్పి దించేయాలి.అంతే ఘుమఘుమలాడుతూ నోరూరించే మునగాకు గోరుచిక్కుడు వేపుడు తయారయినట్లే.మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది.మనం చెబితే తప్ప మునగాకు అనే విషయం తెలియదు.

Tuesday, September 13, 2016

ఆవిరి పూర్ణాలు

         పూర్ణం తయారీకి :
పచ్చి శనగపప్పు /పెసరపప్పు - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
వేయించిన నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
వేయించిన కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
యాలకుల పొడి -- 1 స్పూను

పూర్ణం పైన పెట్టడానికి:
బియ్యప్పిండి - 2 కప్పులు
మంచినీళ్ళు - మూడు కప్పులు
నెయ్యి -1 స్పూను
ఉప్పు - కొద్దిగా
                                                                         పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించి గరిటెతో పప్పును మెత్తగా చేసి దానిలో బెల్లం తురుము,వేయించిన కొబ్బరితురుము,నువ్వులపొడి వేసి నీరు ఇగిరి పోయేంత వరకు తిప్పాలి.ఒక పక్కనపెట్టి ఆరిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి కొద్దిగా ఉప్పు,నెయ్యి వేసి కలపాలి.దానిలో ఉండలు కట్టకుండా బియ్యప్పిండి వేసి తిప్పుతూ దగ్గరకు వచ్చి ముద్దలా అయిన తర్వాత దించేయాలి.ఆరిన  తర్వాత ఈ పిండిని చిన్న పురీల్లా వత్తి దానిలో పూర్ణం పెట్టి మూసేసి గుండ్రంగా చేయాలి.అన్నీ ఇలాగే తయారు చేసుకుని ఇడ్లీ కుక్కర్ లో ఆవిరి మీద ఒక 5 ని.లు ఉడికించాలి.

వెలగ వడ

మినప్పప్పు - 1 కప్పు
పచ్చి శనగపప్పు - 1 కప్పు
పెసర పప్పు - 1/2 కప్పు
వెలగ పండు గుజ్జు  - 1/2 కప్పు
పచ్చి మిర్చి - 5
ఉల్లిపాయ - 1
కరివేపాకు - కొద్దిగా 
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
                                                                        మూడు రకాల పప్పులు కలిపి శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.తర్వాత నీళ్ళు వంచేసి మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి.అందులోనే బాగా పండిన వెలగ పండు గుజ్జు,సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు,సన్నగా తరిగిన కొత్తిమీర,కరివేపాకు,ఉప్పువేసి బాగా కలిపి వడల మాదిరిగా వత్తి కాగిన నూనెలో వేయించి తీసేయాలి.అంతే రుచికరమైన వెలగ వడలు సిద్ధం.దీనిని కొబ్బరి పచ్చడితో లేదా ఎవరికి ఇష్టమైన దానితో వాళ్ళు  తినవచ్చు.